#


Index

  అంతానని పేర్కొనటంలో ఒక స్వారస్యమున్నది. స్థావరాలేకాకజంగమాలు కూడా నని అర్థం. దీనిని బట్టి జగత్తూ, జీవుడూ రెండూ వట్టివేనన్న మాట. ఈ విషయమే భాష్యకారులు సూత్రభాష్యంలో “జన్మాద్యస్య యతః" అనే సూత్రం దగ్గర చక్కగా వ్యాఖ్యానించారు. 'అస్యజగతః నామ రూపాభ్యాం వ్యాకృతస్య అనేక కర్తృ భోక్తృ సంయుక్తస్య' అని ఇందులో కర్తా భోక్తా అంటే జీవుడే. జగత్తన్నప్పుడు జీవులు కూడా కలిసి రావలసిందే గదా. దానికి సూచకమే సమస్తమనే మాట. మొత్తం మీద జీవజగద్రూపమైన ఈ సమస్త సృష్టి వట్టిదే ఎంచేత. 'తదన్యత్' ఆత్మచైతన్యంకన్నా అన్యమైన పదార్థం కాబట్టి ఆత్మకది భిన్నమైతే దాని కస్తిత్వం లేదని ముందే చెప్పాము.

  దీనినే మరికొన్ని హేతువులు చెప్పి బలపరుస్తున్నారు. అవన్నీ ఇంతకు ముందు నుంచీ అక్కడక్కడ పేర్కొంటూ వచ్చినవే. మరలా సంక్షిప్తంగా మనకు బోధిస్తున్నారు. గురుపాదులు. సూత్రప్రాయంగా చెబితే నాలుగే నాలుగు ఉపపత్తులున్నాయి. అందులో మొదటిది 'అపివ్యాపకత్వాత్' వ్యాపకత్వమంటే సర్వత్రా చోటు చేసుకొని ఉండటం 'యేన సర్వమిదం తతమ్' అని గీతావచనం. స్థావర జంగమాత్మకమైన సృష్టినంతా కమ్ముకొని ఉంది ఆ పరమాత్మ చైతన్యం. కమ్ముకొని ఉందంటే అది బాహ్యంగా మాత్రమేనని మరలా అపోహ పడవచ్చు. అంచేత దాన్ని నివారించటానికి 'హితత్వ ప్రయోగాత్' అని రెండవ హేతువును నిరూపిస్తున్నారు హితమన్నా నిహితమన్నా ఉంచబడింది అని అర్థం. 'గుహాహి తం గహ్వరేష్ఠం పురాణమ్' 'ఆత్మా స్య జంతోర్నిహితో గుహాయామ్' ఆ పరమాత్మతత్త్వమే జీవాత్మ అనే పేరుతో వచ్చి మానవుడి బుద్ధిగుహలో ప్రవేశించిందని చాటుతున్నది శాస్త్రం. అంచేత వెలపలేగాక లోపలగూడా వ్యాపించి ఉందని అర్ధం చేసుకోవాలి. లోపల అంటే మరలా జీవుల శరీరాల లోపలననేకాదు. ఆ మాటకు వస్తే అచేతనాలని పేరుపడ్డ పృథివ్యాది భూతాలలోకూడా అదే నిండి నిబిడీకృతమై ఉంది. అంతర్యామి ప్రకరణంలో ఆత్మచైతన్యమే అన్నిటిలోపలా ప్రవేశించి ప్రతిఒక్క భూతాన్నీ యమిస్తూ Restrain ఉందని శాస్త్రం ప్రకటిస్తూ ఉంది. 'యఃపృథివ్యాం తిష్ఠన్ యః పృథివ్యా అంతరో యం పృథివీ న వేద యస్య పృథివీ శరీరమ్ యః పృథివ్యీమంతరో యమయతి ఏష తే ఆత్మా అంతర్యామీ అమృతః' కాబట్టి అంతటా ఆత్మే. అంతటా అదే అయినప్పుడిక మరొకదానికి తావెక్కడిది ? కనుకనే మరేదీ లేదని చెప్పటం.

Page 42