#


Index

  అన్ని దశలూ అదే. దాని యాథాత్మ్యాన్ని గుర్తించక పోవటమే ఇవన్నీ ఆవిర్భవించడానికి కారణం. ప్రకాశమనేది లేకపోవటమే అంధకారమొకటి ఏర్పడటానికి కారణమయింది. గదా. అలాగే ఇదీ. సర్వమూ ఆత్మేనని మరల ప్రత్యిభిజ్ఞ ఎప్పుడేర్పడిందో అప్పుడీ జాగ్రత్స్వప్నాదులూ లేవు. విశ్వతైజసాదులులేవు అంతేకాదు. ఉన్నట్టు కనిపించినప్పుడు కూడా అవికాదు మనకు కనిపించటం, తురీయమైన ఆత్మచైతన్యమే తృతీయందాకా ఆయా దశలలో మనకలా సాక్షాత్కరిస్తున్నది.

  మరలా నేనా తురీయమేనని అనుసంధానం చేసుకొంటే చాలు. దాని అనుభవ మేర్పడుతుంది మనకు. అయితే అది జాగ్రదాది దశలలోనే చేసుకోవాలి సాధకుడు. ఎలాగ అని ప్రశ్న. జాగ్రత్తును స్వప్నంలోకి స్వప్నాన్ని సుషుప్తిలోకి లయం చేసుకొంటూ పోవాలి. అంటే జాగ్రద్దశలో ఎంతో స్పష్టంగా చూచే ఈ ప్రపంచాన్ని స్వప్నంలో మాదిరి అస్పష్టంగా చూడటం నేర్చుకోవాలి. అదికూడా సుషుప్తిలో మాదిరి అసలే లేకుండా చూడాలి. పోతే ఈ సుషుప్తితోనే నిలిచిపోరాదు. ప్రపంచం లేదేకాని అక్కడ ప్రజ్ఞకూడా లేదు. ప్రజ్ఞ లేదంటే అది అవిద్య. అంచేత ఆ అవిద్యను (మరలా) విద్యగా మార్చుకోవాలి మనం. అంటే ప్రపంచాభావాన్ని ప్రజ్ఞతో దర్శించాలని అర్థం. అలా దర్శించగలిగితే అది తృతీయాన్ని కూడా దాటి తురీయమవుతుంది. అయితే అప్పుడంతా ఆత్మేకాబట్టి అన్నిదశలూ తురీయంగానే భాసిస్తాయి. దానితో తురీయమనే వ్యవహారం కూడా పోయి అది అఖండాత్మ రూపంగానే అనుభవానికి వస్తుంది.

శ్లోకం 9

అపి వ్యాపకత్వాద్ హితత్వ ప్రయోగాత్
స్వతః సిద్ధభావా దనన్యాశ్రయత్వాత్ |
జగత్తుచ్ఛమేతత్ సమస్తం తదన్యత్
తదేకో వశిష్టః శివః కేవలో 2 హమ్ ॥

  ఇంతవరకు జరిగిన శాస్త్రార్ధమంతా సంగ్రహించి ఒక్కచోట చెబుతున్నా రాచార్యులవారు. అందులోనూ పూర్వోక్తరీతికి భిన్నంగా మొదటి రెండు పాదాలలో హేతువును చెప్పి మూడవ పాదంలో విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు. 'జగత్తుచ్ఛ మేతత్సమస్తమ్' అనేది ప్రతిపాద్యమైన విషయం. తుచ్చమంటే నీచమని కాదు శూన్యమని అర్థం. నామరూపాత్మకంగా కనపడే ఈ జగత్తంతా వట్టి శూన్యమే.

Page 41