శాస్త్రమంటే మనమనుకొనే ధర్మనీతి తర్క వ్యాకరణ వైద్యజ్యోతిషాదులు కావు. ఇవన్నీ పౌరుషేయమైనవి. అంటే పురుషబుద్ధి జన్యమని అర్ధం. పోతే ప్రస్తుతం శాస్త్రమని చెప్పేది ఇలాంటి పౌరుషేయంకాదు. అది అపౌరుషేయం. మానవబుద్ధికే అతీతమది. అదే ఋగ్యజుస్సామాథర్వాణాది వేదవాఙ్మయం. ఇది భూత భౌతిక ప్రపంచంలాగా సృష్టి అయింది కాదు. సృష్టికర్త అయిన హిరణ్యగర్భుడు కూడా జన్మించక పూర్వమే ఏర్పడి ఉన్నదది. "యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యోవై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై" అని మంత్రవర్ణం. కాబట్టి శాస్త్రమనాది సిద్ధం. “అనాది నిధనా నిత్యా వాగుత్సృష్టా స్వయంభువా" అని మనువే చాటాడు లోకానికి.
అయితే అనాది అంటే అక్షరరూపంగా కనిపించే ఈ గ్రంథమేనని అపోహ పడరాదు. గ్రంథ రూపంగా కాదనాది అంటే. శబ్దరూపంగా, శబ్దానికే వాక్కనికూడా నామాంతరం. ఈ వాక్కనేది నాలుగు భూమికలలో వర్తిస్తుంది. అందులో వైఖరీ రూపమైన వాక్కునే మనమిప్పుడు ఋగ్వేదమనీ, యజుర్వేదమనీ వ్యవహరిస్తున్నాము. ఇది శబ్దానికి స్థూలమైన రూపం. కాగా దీని వెనకాల అంతకన్నా సూక్ష్మమూ, సూక్ష్మతరమూ, సూక్ష్మతమమూ అయిన దశలుకూడా ఉన్నాయి. అన్నిటికన్నా సూక్ష్మమైన దానికే 'పరా' అని పేరు. ఈ 'పరా' అనేది పరమేశ్వరుడితో ఏకమై ఉంటుంది. అది కేవల మాచైతన్యశక్తే 'పరాస్య శక్తిః' అని శ్వేతాశ్వతరమే వర్ణిస్తున్నది. పరమాత్మతో ఓతప్రోతమయిన ఈ శక్తి ఆ చైతన్య సాగరంలో ఆవిర్భవించిన ఒక ఇచ్ఛా తరంగం. ఈశ్వర సంకల్పమని కూడా దీనినే పేర్కొంటారు. అయితే ఇది మనకు గలిగే సంకల్పాలలాగా నశ్వరమయినది కాదు, పరమాత్మ సత్యస్వరూపుడు కాబట్టి తద్గతమయిన సంకల్పంకూడా సత్యసంకల్పమే. దీనినే తపస్సనీ, దృష్టి అనీ, కామమనీ, ఈక్షణమనీ అనేక సంజ్ఞలతో వ్యవహరిస్తుంది శాస్త్రం. మొత్తానికిది విశ్వచైతన్యంతో ముడిబడిన ఒకానొక వృత్తి విశేషం, కనుకనే చైతన్యంలాగా ఇది నిత్యమే అయింది. అయితే అది ఇంకా అవ్యక్తంగానే ఉందిగాని వ్యక్తమయిన దశకు రాలేదు. అవ్యక్తంగా ఉన్నంతవరకూ అది పరా.
ఆ పరారూపమయిన వాక్కే క్రమంగా ఆత్మ పరామర్శ చేసుకొని 'పశ్యంతి' అయింది. అది భూత సృష్టి కున్ముఖమయ్యేసరికి 'మధ్యమ' అయింది. తీరా సృష్టి జరిగే సమయానికి 'వైఖరి'గా మారిపోయింది. ఇప్పుడు మనం చూచేదంతా వైఖరి రూపమే.
Page 21