ఇంతకు ముందు రచించిన ఆ రెండు వ్యాఖ్యానాలకన్నా పరిమాణంలోనే కాక గుణంలో కూడా కొంత విలక్షణత ఉంది ఈ వ్యాఖ్యానంలో. శ్లోకానికీ శ్లోకానికీ సాంగత్యం చూపటమిక్కడ చాలా శాస్త్రీయంగానూ, భగవత్పాదుల విధానాని కతి సన్నిహితంగానూ నడిచింది. శ్లోకానికి మొత్తం మీద కాకుండా ప్రతి పదాన్నీ మరలా ఉదాహరిస్తూ దాని అర్థాన్నీ ఔచిత్యాన్ని కూడా వివరించటం జరిగింది. అప్పటికి వాక్యార్థ వివరణమే కాక ఒక విధంగా పదార్థ వివరణ ఇది. దీని మూలాన మూలకారుల భావాలన్నీ పట్టుకు రావటమలా ఉంచి వాటికి దూరంగా పోక వాటినే ఎప్పటికప్పుడంటి పట్టుకొనే అవకాశమేర్పడింది. ఒకవేళ అడపా దడపా దూరం వెళ్లినట్టు కనిపించినా అది గురువుగారు సూచనాప్రాయంగా చెప్పిన విషయాన్నే శాఖోపశాఖలుగా విస్తరించి చూపటమే గాని మరేదీకాదు. మొత్తానికి వారి కేనోపనిద్భాష్యం పదార్థ వాక్యార్థ రూపంగా ఎలా సాగిందో అలా సాగించాలని చూచానీ వ్యాఖ్యానం నేను. శాంకరమైన భాష్యధోరణిలో నడిస్తే చాలు. ఇక ఎలాంటి శంకలకు ఆస్కారముండబోదు. అది నేను నా రచనలలో మొదటి నుంచీ పెటుకొన్న వరవడే. అదే ఇప్పుడిందులోనూ పాటిస్తూ వచ్చానని మీకు విన్నవిస్తున్నాను.
అయితే ఎందుకయ్యా మరలా మీరీ దశశ్లోకీనే పట్టుకొని నలగ గొడుతున్నారని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. అలా ప్రశ్నించే వారికి నేను భగవత్పాదుల మాటలలోనే సమాధానమివ్వవలసి ఉంటుంది. ఉపనిషత్సూత్ర భాష్యాదులుండగా మరలా ఈ భగవద్గీత కెందుకండీ ఇంత ప్రయత్నం చేయటం మీరని ప్రశ్నిస్తే ఆయన ఇచ్చిన జవాబిది.
Page 9