మానసోల్లాసమని ఒక మహోజ్జ్వలమైన శ్లోకవార్తికం వ్రాశారాయన ఈ స్తోత్రానికి నిజంగా మానసోల్లాసమే అది సందేహం లేదు.
ఇంత ప్రాశస్త్యాన్ని సంపాదించుకొన్నదీ దక్షిణామూర్తి స్తోత్రం. అయితే ఒక చిన్న ఆశంక దక్షిణామూర్తి దక్షిణామూర్తి అంటున్నారే. మూర్తి పూజ ఉపాసకులైన ద్వైతులకే గాని అద్వైతులు చేయవలసిన సాధన ఆత్మవిచారమొక్కటేనని గదా భగవత్పాదులు బోధించింది. అలాంటప్పుడు- "తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదమ్ శ్రీ దక్షిణామూర్తయే” అని ముగ్గురికి నమస్కార మంటున్నాడు. కాబట్టి సగుణమే కావాలది. మరి ఈ గురుమూర్తి ఎవరు? ఇద్దరూ ఒకేతత్త్వమా? లేక రెంటికీ తేడా ఉందా? చూడబోతే ఇదంతా ఉపాసనా మార్గమేగాని జ్ఞానమార్గం కాదని తోస్తుంది. అలాగే తోచింది చాలామంది సాధకులకు. తదనుగుణంగానే, వారీ స్తోత్రానికి వ్యాఖ్యానాలు వ్రాసి ప్రకటించారు. సురేశ్వరులు కూడా ఆ మాటకు వస్తే కొంత అటు మొగ్గుచూపినట్టు కనిపిస్తుంది. దక్షిణామూర్తి కొక రూపకల్పన దానికొక మంత్రమూ - అనుష్ఠానమూ - ఇలాంటి ప్రక్రియ కూడా ఉదాహరించారాయన తన గ్రంథాంతంలో. అయితే అది సగుణోపాసకులను కూడా కలుపుకోటానికి చెప్పారను కోవచ్చు మనం.
కాగా భగవత్పాదు లిందులో జ్ఞానమే ఉద్దేశించారు. మరేదీగాదని నా నమ్మకం. అలాగైతేనే వారి భాష్య గ్రంథాల దగ్గరినుంచీ స్తోత్ర గ్రంథాల వరకూ ఏకవాక్యత Consistancy అనేది కుదురుతుంది. లేకుంటే కుదరదు.
Page 5