ప్రతి ఒక్కటికీ ఒకే ఒక అద్వైత విజ్ఞాన దీప్తిని దిక్కుల వెదజల్లేదే. అది చిన్నదీ, పెద్దదీ, భాష్యం, స్తోత్రమనే తేడా లేదు. ఎక్కడ దేనిని కదలించినా దానిలోనే సమగ్రమైన విజ్ఞానం దాగి ఉంటుంది. పోతే దానిని బయటికి లాగి మరలా దాని నంతటినీ ఆకళించుకొని అనుభవానికి తెచ్చుకోవటమే మనబోటి సాధకుల కర్తవ్యం.
ఇదిగో ఇదే సరిగా నేను చేయదలుచుకొన్న సదుద్యోగం. ప్రస్థానత్రయ పారిజాతం- జగద్గురు మహోపదేశం సాధకగీత, అనే నెపం పెట్టి స్వామి వారి అద్వైత భావాలన్నిటినీ యథాశక్తిగా వెలికి తీసి సాధక లోకానికందించాను. పోతే వారి స్తోత్రాలను కూడా ఒకటి రెండు వ్యాఖ్యానించి అందులో దాగిన అనర్ఘ భావాలను కూడా బయటపెట్టాలని తోచింది. నిర్వాణదశక వ్యాఖ్య ఆ దృష్టితోనే రచించి ప్రకటించాను. అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా వ్యాఖ్యానించాలని మనసులో పడింది. అన్ని స్తోత్రాలూ ఒక ఎత్తయితే ఈ దక్షిణామూర్తి స్తోత్రమొక్కటీ ఒక ఎత్తు. ఇది ఆచార్యులవారి స్తోత్రాలన్నిటిలో మకుటాయమానమైనది. స్తోత్రరాజమని చెప్పినా చెప్పవచ్చు. లక్ష పొటెన్సీ గల హోమియో మాత్రలో ఎంతటి శక్తి ఉందో, అంతకు మించిన శక్తి ఉన్నది. ఈ చిన్న స్తోత్రంలో భాష్య ప్రకరణాదులన్నిటిలో విస్తరించి చెప్పిన విషయజాతమంతా ఎంతో సంగ్రహించి రచించినదీ స్తోత్రం. ఇది లస్పర్శిగా చూడగలిగితే ఇక ఏ గ్రంథమూ తడవనక్కర లేదనిపిస్తుంది. అందుకేనేమో గురువుగారి కత్యంత ప్రియశిష్యుడైన సురేశ్వరుడాయన భాష్యద్వయానికి వార్తికాలు వ్రాసి వార్తిక కారుడని ప్రసిద్ధి చెందినవాడు మరలా చేయివేసి తాకినది దశశ్లోకీ ఒక్కటే.
Page 4