ప్రవేశము
జగద్గురు శ్రీ మచ్ఛంకర భగవత్పాదుల అవతారం మానవ జాతి బహు జన్మలనోము ఫలం. జీవిత పరమార్థమేమిటో, దాన్ని ఎలా అందుకొని తరించాలో మొగమాటం లేకుండా చాటి చెప్పిన మహానుభావుడాయన. అందుకోసమాయన చేసిన బోధనలు, వ్రాసిన రచనలు అసంఖ్యాకం. బోధనలు వినే భాగ్యమాకాలం వారికి పడితే, రచనలు చదివే మహాభాగ్య మీకాలంలో మనకు దక్కింది. చిత్రమేమంటే ఇవి చదువుతూంటే ఆయన మూర్తి వచ్చి మన దగ్గర కూచున్నట్టే ఉంటుంది. అందుకే ఎవరైనా మీకు గురువెవరని అడిగితే తడువుకోకుండా భగవత్పాదులని సమాధానమిస్తుంటాను నేను.
భగవత్పాదులు మన కనుగ్రహించి పోయిన రచనలిన్ని అన్ని కావు. ముఖ్యంగా వాటన్నిటినీ మనం మూడు జాతులుగా విభజించవచ్చు. మూడూ సాధకులలో మూడు తెగలవారి నుద్దేశించి సాగిన రచనలు, ఉత్తమాధికారుల కోసమాయన భాష్యగ్రంథాలు, మధ్యముల కోసం ఉపదేశసాహస్రి లాంటి ప్రకరణాలు. మరి మందాధికారుల కోసం దశశ్లోకీత్యాది స్తోత్రాలు, అందులో ప్రతి ఒక్కటి ఒక అమూల్యమైన రత్నము.
Page 3