అంటే విశ్వతోముఖమైన ఆత్మ స్వరూపం మనకు తెరదీసినట్టు సాక్షాత్కరిస్తుంది. జీవ జగదీశ్వరులనే మూడు తత్త్వాలుగా అంతకు ముందు నుంచీ భాసిస్తూ వచ్చినదంతా అప్పుడాత్మ చైతన్యంలోనే లీనమై ఒకే ఒక అఖండ తత్త్వంగా అనుభవానికి వస్తుంది. దానితో ఇక మరలా మనకీ సంసార సాగరంలో వచ్చిపడే ప్రమాదం తప్పిపోతుంది. యత్సాక్షాత్కరణా దృవేన్న పునరావృత్తి ర్భవాంభో నిధౌ. పునరావృత్తి అంటే మరలా రావటం అది ఈ ఆత్మ సాక్షాత్కరం వల్ల తప్పుతుందని హామీ ఇస్తున్నారాచార్యుల వారు. ఏమి కారణం. రావటానికీ పడటానికీ సంసార మనే దొకటి ఉంటే గదా. సంసార మంటే ఏమిటి. ఈ చరాచర జగత్తు. ఇదే భవాంభోనిధి మనపాలిటికి. దీనిలో వచ్చి పడటమంటే మనమే గదా పడవలసింది. మనమంటే ఎవరు జీవులు, జీవ జగత్తులు రెండూ ఆత్మ అనే భావంతో దర్శించినప్పుడవి ఇక ఎక్కడివి. అవి లేకుంటే సంసారమెక్కడిది. కాబట్టి అన్ని భూతాలనూ ఉచ్చాటనం చేసే అద్భుతమైన మహామంత్రం తత్త్వమసి.
ఈ “తత్త్వమసి" వాక్యమే సద్గురువైనవాడు సాధక లోకాని కుపదేశించ వలసింది. ఇది ఉపదేశ వాక్యమైతే “అహం బ్రహ్మాస్మి” అనేది అనుభవ వాక్యమన్నారు పెద్దలు. ముందుపదేశం తరువాత అనుభవం ఇది గదా క్రమం ఎవరుపదేశించాలి మనకిది. సద్గురువని పేర్కొన్నాము. ఎవరా సద్గురువు ఇంకెవరు. దక్షిణామూర్తి వేషధారి అయిన ఆ పరమేశ్వరుడే. గురూణాం గురుః అన్నట్టు జగద్గురువాయన.
Page 36