దీనికి సమాధానం చెప్పటంలోనే ఉంది ఆచార్యులవారి చాకచక్యం. ఆయన రెండింటికీ కలిపి ఒకే ఒక దృష్టాంతంతో సమాధానమిచ్చారు. అదే దర్పణ దృష్టాంతం. ఒక పెద్ద నిలువుటద్దం తెచ్చి ఒక పట్టణాని కెదురుగా నిలిపితే ఆ పట్టణమంతా అందులో ప్రతిఫలిస్తుంది. ఇప్పుడా అద్దంలో కనపడే పట్టణం ఉందంటావా? లేదంటావా? కనపడుతూంది కాబట్టి వాస్తవమనే చెప్పవచ్చు. కాని అంత పెద్ద పట్టణం అద్దంలోకి ఎలా వచ్చింది? అందులో ఎలా ఇమడగలిగింది? అద్దమున్నప్పుడే అలా కనిపిస్తున్నది. కాని అది తొలగిస్తే పోతుంది. కేవలం ప్రతిబింబమే అది బింబం కాదు. బింబమద్దంలో లేదు. దాని వెలుపల ఉంది. అద్దంతో నిమిత్తం లేదు దానికి. అద్దమున్నా లేకపోయినా ఉండగలదది. కనుక అదే సత్యం. దాని ప్రతిబింబైన ఇది సత్యం కాదు. అసత్యం.
అలాగే ఈ ప్రపంచం కూడా మనకు కనిపించేది వాస్తవం కాదు. ఇది దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. అద్దంలో కనిపించే పట్టణం లాంటిది. ప్రతిబింబమే గాని ఇది బింబం కాదు గనుకే అసత్యం. కనిపిస్తున్నా అది అద్దంలో కనిపించటం లాంటిదే. అద్దమేమిటిక్కడ? మన చైతన్యమే. చైతన్యమనే స్వచ్ఛమైన దర్పణంలో పశ్యన్ తొంగి చూస్తున్నాను నేను. చూచేసరికి నిజాంతర్గతం. నాలోనే నాచైతన్యం లోనే అంతర్గతంగా ఉన్న ప్రపంచం బహిరివోద్భూతం బహిర్గతమై ఇలా భాసిస్తున్నది. వస్తుతః ఇది అంతర్గతమే. నాలోపలే ఉన్నది. అదే బింబం. పోతే దాని ప్రతిబింబమే ఈ వెలపల కనిపించే విశ్వం ప్రతిబింబమే గనుకే ఈ ప్రపంచమంతా అప్పటికబద్ధమే. కనిపించ కుందా మన లోపల ఉన్నదే నిజం.
Page 16