జీవ జగదీశ్వరులనే ఈ తత్త్వత్రయాన్ని గూర్చే ఎంతటి మేధావంతుడైనా ఎప్పుడైనా చర్చించవలసింది. తేల్చుకోవలసింది. ఇంతకు మించి వేరొక పదార్థమంటూ లేద సృష్టిలో చర్చించటానికి.
అలాంటప్పుడు మూడింటిని గూర్చి ఆలోచించాలి గదా! ఒక్క జగత్తును గూర్చే ఎందుకాలోచిస్తున్నారు ఆచార్యులవారు? జగత్తనేది నిత్యమూ మన ఎదటున్న పదార్థం. ఇది మనకు ప్రత్యక్ష సిద్ధం. మిగతా రెండూ ఇలా ప్రత్యేకంగా కనిపించవు. ఎప్పుడు గాని దృష్టమైన దాన్నిబట్టే అదృష్టమైన తత్త్వాన్ని వెతుకుతూ పోవాలంటారు శాస్త్రజ్ఞులు. అదే సబబు కూడా. పైగా మానవుడి కున్న సమస్య ఈ ప్రపంచమే. తనకు తాను కాదు. తనకు కనపడకుండా ఎక్కడో ఉన్న ఈశ్వరుడూ కాదు. తనకు తానంటే జీవుడికి జీవుడే. జీవుడికి జీవుడు సజాతీయమే కాని భిన్నం కాదు. భిన్నం కాకపోతే అది సమస్యే కానేరదు. పాము కోరలలో ఉండే విషం పామునే చంపదు గదా. అలాగే జీవుడే జీవుణ్ని బాధించడు. పోతే పరోక్షంగా ఉన్న ఈశ్వరుడూ జీవుడికి సమస్య కాదు. ఎక్కడో దూరంగా ఉన్న పాము ఎంత విషజంతువైనా దానివల్ల మనకు హాని లేదు గదా. ఎటువచ్చీ అటు దూరంగానూ లేక ఇటు మన స్వరూపమూ కాకుండా ఉన్నదీ ప్రపంచమే. కాబట్టి ఇదే మనల నెప్పుడు అంటి పట్టుకొని వెంటాడుతున్న ఏకైక సమస్య.
ఈ ఒక్క సమస్యను పరిష్కరించ గలిగితే మిగతా రెండూ వాటిపాటి కవే పరిష్కారమవుతాయి. ఎలాగంటే ప్రపంచాన్ని బట్టే జీవుడు. ప్రపంచం లేకపోతే జీవుడు లేడు.
Page 13