#


Index

  నా స్వరూపమసలు శుద్ధమైన చైతన్యం. నేననే భావం తప్ప మరేదీ కాదది. నిరాకారం కాబట్టి ఆకాశంలాగా సర్వవ్యాపకం. చైతన్య స్వరూపం కాబట్టి స్వతస్సిద్ధం. కేవలం ఉండటమనే స్ఫూర్తి కాబట్టి అది సామాన్యం. పోతే మిగతా పదార్ధాలన్నీ ఆయా నామరూపాలుగా ఉండటం కాబట్టి దానికవి విశేషాలు. విశేషాలెప్పుడు గానీ సామాన్యంకన్నా వేరుగావు. మృత్తికకన్నా ఘటశరావాదులు వేరుగావు గదా. సువర్ణంకన్నా కటక కుండలాదులు వేరుగావు గదా. అలాగే సచ్చిత్సామాన్యమైన ఆత్మకన్నా ఏదీ విలక్షణంగా లేదు. అంటే ప్రమాతృ ప్రమేయ ప్రమాణాలుగా కనిపించేవి మూడూ వాస్తవానికాత్మ స్వరూపాలే. అయినా చిత్రమేమంటే ఆత్మ స్వరూపమయి కూడా అవి ఆత్మకు భిన్నంగా భాసిస్తున్నాయి. కారణం అఖండమైన మన ఆత్మచైతన్యాన్ని మనం గుర్తించకపోవటమే. దీనికే అజ్ఞానమని పేరు. ఈ అజ్ఞానం మూలంగా అఖండమైన మన స్వరూపమే ఖండమై ఒకటి ప్రమాతగా ఒకటి ప్రమేయంగా మరొకటి ప్రమాణంగా చలామణి అవుతున్నాయి. ఈ త్రివిధమయిన రూపాలు ధరించి కనిపిస్తున్నదేదో గాదు మన ఆత్మచైతన్యమే.

  అయితే ఎటువచ్చి ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. గుర్తించాలంటే ప్రమాత్రాదులుగా గోచరమయ్యే ఈ మూడింటినీ చక్కగా వివేచన చేసి చూడాలి. వివేచించిన కొద్దీ ఇవి తమ నకిలీ వేషాలకు స్వస్తి చెప్పి అసలయిన ఆత్మస్వరూపంగా ఇవే మనకు దర్శనమిస్తాయి. అప్పుడంతా కలిసి ఒకే ఒక ఆత్మ అనే పూర్ణానుభవ మప్రయత్నంగా మనకు సిద్ధిస్తుంది. ప్రస్తుత మా శోధన మార్గాన్నే ప్రదర్శిస్తున్నాయి మనకీ మూడు శ్లోకాలు. వీటిని గాథలనీ పేర్కొన్నారు శంకర భగవత్పాదులు. ఇవి ఏ గ్రంథంలోనివో తెలియదు. వీటికి కర్త ఎవరో తెలియదు. బహుశా బ్రహ్మవేత్తల గురుశిష్య పరంపరలో అనూచానంగా వస్తున్నవి కాబోలు. భాష్యకారులు కూడా కేవలం 'బ్రహ్మవిదాం గాథాః' అని మాత్రమే పేర్కొన్నారు. అంతకుమించి మరేమీ మాటాడలేదు. ఇవి తమ చతుస్సూత్రి భాష్యం చివరన వారుదాహరించిన శ్లోకాలు. క్రమంగా ఒక్కొక్క దానిని పరిశీలించి చూతము.

గౌణ మిథ్యాత్మనో 2 సత్త్వే
పుత్రదేహాది బాధనాత్ ।
సద్రహ్మాత్మాహ మిత్యేవం
బోధే కార్యం కథం భవేత్ ||

Page 6