స్వప్నద్రష్టా కాడు. వాడి తాలూకు ఇంద్రియ వర్గమూ కాదు. మరెవరు. ఆ మూడింటినీ సాక్షిగా చూస్తూ మంచం మీద పడుకొని ఉన్న మనమే మన జ్ఞానమే. మెలకువ రాగానే అవి మూడూ తొలగిపోయి మన జ్ఞానం నిలిచి ఉండటమే దీనికి నిదర్శనం. అప్పుడా స్వప్నమనే ప్రమేయమూ, దానితో వ్యవహరించిన ప్రమాతా అతడి తాలూకు చక్షురాది ప్రమాణాలూ ఒక్కటీ కానరాదు. మూడూ కలిసి మన జ్ఞానంలోనే విలీనమై పోయాయి.
అలాగే ప్రస్తుత మీ జాగ్రద్దశలో కూడా నేను నేనని భావించే ఈ ప్రమాతా ఈ ప్రమాతకు గోచరించే నామరూపాది ప్రపంచమూ దాన్ని గ్రహించటానికి తోడ్పడే ఇంద్రియ కలాపమూ- ఈ ప్రమాతృ ప్రమేయ ప్రమాణాలు మూడే-స్వప్న దశలోలాగా అంతా హుళక్కే. అక్కడ మన ఆత్మ మరుగునపడి వాటినెలా కనిపెట్టి చూస్తున్నదో ఇక్కడా అలాగే చూస్తున్నది. అక్కడ మెలకువ వస్తే ప్రమాత్రాదులు మూడూ కరగిపోయి మన స్వరూపం మాత్రమే ఎలా మిగిలిపోతుందో ఇక్కడా అంతే. అయితే ఎంతవరకంటే స్వప్నం నుంచి మెలకువ అప్రయత్నంగా వస్తుంది. అప్రయత్నంగానే తొలగిపోతుంది. కాని జీవితంలో మాత్రం మనం దాన్ని ప్రయత్నంతో సాధించవలసి ఉంది. అలాగైతేనే తొలగకుండా మనకది శాశ్వతంగా దక్కుతుంది. ఆ ప్రయత్నం అఖండాత్మ భావనారూపమైన జ్ఞానమైతే- ఆ కలిగే మహాఫలమేదో గాదు మోక్షం. సంసారమనేది అజ్ఞాన జన్యమైతే మోక్షం జ్ఞానైక సాధ్యం. అజ్ఞానంవల్ల అఖండమైన ఆత్మచైతన్యం ప్రమాత ప్రమేయం ప్రమాణమని మూడు ఖండాలయి మనలనీ సంసారంలో కట్టిపడేస్తే జ్ఞానంవల్ల మరలా అవి మూడూ ఎకమై అఖండ రూపంగా భాసించి మనకు ముక్తిని ప్రసాదిస్తుంది. మొత్తానికీ మూడూ గాథల మూలంగా మనకు బోధపడే జీవిత పరమార్థమిదే. ఒక్కమాటలో పరిపూర్ణాత్మానుభవం.
Page 14