కాని ఆయా కోరికలు బలంగా ఉండి ఆయా దేవతలను సేవిస్తుంటారు మానవులు. దానికి కారణం ద్వంద్వ మోహం. అది పుట్టుకతోనే ఏర్పడింది మనకు. ప్రకృతి గుణాలను దాటి పోనివ్వదది. గుణాధీనుడైన ఈ జీవుడికిక గుణాతీతమైన తత్త్వమెలా బోధ పడుతుంది. పడితే గాని సగుణాన్ని నిర్గుణం తాలూకు విభూతిగా దర్శించ లేదు. అలా దర్శిస్తే అది జ్ఞానమే గాక విజ్ఞానం కూడా అవుతుంది.
అక్షర పరబ్రహ్మయోగం
అక్షరమంటే నశించనిది. అది మాయాశక్తి అయితే దాని కన్నా పరమైన అక్షరం పరమాత్మ. ఈ అక్షర మా అక్షరాన్ని చూపటానికే ఉంది. ఇది ఓంకార రూపంగా భావించారు పెద్దలు. ఓంకారమంటే అ ఉ మ - మూడక్షరాల సంపుటి. మూడూ మూడు ప్రపంచాలకూ మూడు శరీరాలకూ ముగ్గురు జీవులకూ సంకేతం. ఓంకారానికే ప్రణవమని కూడా పేరు. దాన్ని ఉచ్చరించేటప్పుడు దానికి వాచ్యమైన ఈ అర్థాన్ని మనసుకు తెచ్చుకోవాలి. వాచకమైన శబ్దమెక్కడ ఆగిపోతుందో అక్కడ ఈ జీవ జగద్భావాలు కూడా లయమయిపోతాయి.
Page 48