#


Index

నిర్వాణ దశకము - అవతారిక

  గ్రంథాన్ని వ్యాఖ్యానించే ముందు గ్రంథ ప్రతిపాదితమైన విషయమేమిటో -దాని నాచార్యులవారు ప్రతిపాదించిన విధానమేమిటో పరిశీలన చేయటం చాలా ముఖ్యం. ఈ గ్రంథ ప్రమేయమంతా దీని మకుటంలోనే ఇమిడి ఉంది. ప్రతి శ్లోకంలోనూ నాలుగవ పాదానికి మకుటమని పేరు. అది అన్ని శ్లోకాలకూ అన్వయిస్తూ పోతుంది. “తదేకో వ శిష్టః శివః కేవలో 2 హమ్” అనేది ప్రస్తుత స్తోత్రానికి మకుటం. స్తోత్రానికంతటికి ఇదే కీలక స్థానం కాబట్టి అర్ధాన్ని భావన చేస్తే అంతా భావన చేసినట్టే అవుతుంది.

  అవశిష్టమంటే చివరకు మిగిలేదేదో అది. అది ఏకం. అంటే దానికి భిన్నంగా మరొక పదార్థమే లేదని అర్థం. భిన్నమైనది మరొకటి లేకపోయినా దానిలోనే అంతర్గతంగా భేదముండవచ్చు గదా అంటే అదికూడా లేదని చాటుతున్నది కేవలమనే శబ్దం. కేవలమంటే స్వగత భేదం కూడా లేనిదని అర్ధం. స్వగత భేదం లేనిదెప్పుడూ రూపరహితమే అవుతుంది. దీనిని బట్టి అది అద్వితీయమూ నిరాకారమూ అయిన పదార్ధమని తేలుతున్నది. అలాంటిది గనుకనే అది శివం. సుఖదుఃఖాదులైన ద్వంద్వాలకు అశివమని పేరు. ద్వితీయమైన దొకటి ఉన్నప్పుడే అవి మనకు ప్రాప్తిస్తాయి. అద్వితీయ మన్నప్పుడలాంటి ప్రమాదంకూడా లేదు. మొత్తంమీద ఏకమూ అద్వితీయమూ నిరాకారమూ నిరంజనమూ అయిన పదార్ధమది.

  అయితే ఇలాంటి పదార్థమెక్కడ ఉంది? దాని స్వరూపమేమిటి? అని ప్రశ్న. దాని స్వరూపాన్ని బయటపెట్టేదే 'అహమ్' అనే మాట. అహమ్ అంటే నేను అని అర్థం. నేను అనే ఒకానొక స్ఫూర్తి ఇప్పుడు మనందరిలోనూ ఉంది. అనుక్షణమూ అనుభవానికి వస్తూనే ఉంది. మరేదైనా ఉందో లేదో సందేహిస్తాము. కాని నేనున్నాననే విషయంలో ఎవరికీ సందేహంలేదు. ఆబాలగోపాలమూ అది ప్రసిద్ధమే. ఈ స్ఫురణకే ఆత్మ అని పేరు పెట్టారు వేదాంతులు.

Page 7