#


Index

పీఠిక

  "తదేకో వ శిష్ఠ శివః కేవలో హమ్" అనే మకుటంతో పది శ్లోకాలు బాగా ప్రచారంలో ఉన్నాయి. వీటికి నిర్వాణదశకమని పేరు. ఇది జగద్గురు శంకర భగవత్పాదుల రచన అని ప్రతీతి. అలాగే కనిపిస్తుంది. సందేహం లేదు. భగవత్పాదులు బోధించిన అద్వైత వేదాంత రహస్యాలన్నీ ఇందులో చక్కగా పొందుపడి ఉన్నాయి. పరమ పురుషార్ధాన్ని బోధించి లోకాన్ని ఉద్దరించటమే భగవత్పాదుల ధ్యేయం. ఈ మానవలోకాన్ని ఆయన మూడుజాతులుగా విభజించారు. అందులో మొదటివారుత్తమాధికారులు. ఎంత గంభీరమైన విషయమైనా అవలీలగా గ్రహించగలవారు. వీరికోసం అతివిపులమూ అతిసూక్ష్మమూ అయిన భాష్యగ్రంథాలను ప్రసాదించారాయ రెండవవారు మధ్యమాధికారులు వీరంత దీర్ఘమైన విచారణకు తట్టుకోలేరు. ఉన్న విషయమెంత క్లిష్టమైనా సంగ్రహించి చెబితే అవగాహన చేసుకోగలరు. ఇలాంటి వారికోసమాయన "ఉపదేశ సాహస్రి" "వివేక చూడామణి"లాంటి ప్రకరణ గ్రంథాలు (Treatises) రచించారు. పోతే ఇక మూడవజాతి వారు మందాధికారులు. వీరికి గ్రహణశక్తి చాలా తక్కువ. అయినా శ్రద్ధాభక్తులకే మాత్రమూ తక్కువలేదు. తమ అంతస్తుకు దిగివచ్చి బోధిస్తే మాత్రం అందుకోగలరు. జగద్గురువులు సార్ధక నామధేయులు కాబట్టి వారికది ఒక్క లెక్కలోనిది కాదు, అలాంటి వారికి కూడా పనికివచ్చే గ్రంథాలు రచించారాయన. అవే భజగోవిందాదులైన నానావిధ స్తోత్ర గ్రంథాలు.

  అయితే ఒక చమత్కారమేమంటే భగవత్పాదులే రచన చేసినా సరే, ఎవరికోసం వ్రాసినా సరే, ఎక్కడికక్కడే శాస్త్రప్రమేయ (Scope of the subject) మంతా అందులో ఇమిడ్చి లోకానికందిస్తూ వచ్చారు. ఎంతెంత లోతుకు దిగితే అంతంత విషయం మనకు బోధపడుతూ పోతుంది. చివరకంతా ఇక్కడే ఉందనే సంతృప్తి కూడా కలుగుతుంది సాధకుడికి.

Page 3