శ్లోకం 3
న మాతా పితా వా న దేవా న లోకా
న వేదా న యజ్ఞాన తీర్థం బ్రువన్తి |
సుషుప్తా నిరస్తాతిశూన్యాత్మకత్వాత్
తదేకో వశిష్టః శివః కేవలో హమ్ ॥
భౌతిక జగత్తూ, శాస్త్ర జగత్తూ రెండూ అబద్దమేనని తేలిపోయింది. పోతే ఈ రెండింటితో వ్యవహరించే జీవుడొకడున్నాడు. ఆ జీవుడీ శరీరంలోనే ఉన్నా శరీరంతో సంబంధం లేదతనికి. స్థూలశరీరం రేపు పతనమై నశించిపోవచ్చు. కాని జీవుడు నశించడు. సూక్ష్మశరీరమని మరి ఒక శరీరమున్నది. అది మనః ప్రాణాత్మకం. ఆ మనః ప్రాణాలు జీవుడికి కేవలం ఉపాధులేగాని జీవుడు కాదు. అందులో కూర్చొని ఈ జీవుడు లోకాంతరాలకు వెళ్ళుతాడు. అక్కడ కర్మ ఫలమనుభవించి మరలా కర్మ ఫలశేషంతో ఈ భూమిమీద జన్మిస్తాడు. దీనికంతటికి అతడిహంలో చేసుకొనే ధర్మాధర్మాలే నిమిత్తం. ధర్మాలెక్కడివి వట్టిదని కొట్టివేయటానికి లేదు. అది వట్టిదైతే అకృతాభ్యాగమ కృత విప్రణాశాలనే దోషాలకు జవాబు చెప్పవలసి వస్తుంది. అకృతా భ్యాగమమంటే మనం చేయనిది వచ్చి నెత్తిన పడటం. కృత విప్రణాశమంటే చేసినది మాఫీ అయిపోవటం. రెండూ అశాస్త్రీయమే. అంచేత వాటిని సమర్ధించటానికి ధర్మాధర్మాల నొప్పుకొని తీరాలి. ఒప్పుకొంటే పూర్వోత్తర రూపమైన జన్మ పరంపర తప్పదు జీవుడికి. దీనినిబట్టి జీవుడనే తత్త్వమొకటి నిత్యంగా ఉందని తేలుతున్నది. అలాంటప్పుడా జీవుడికి సంబంధించిన జననమరణాలూ, లోకాంతర జన్మాంతరాలూ వాడు చేసుకొనే ధర్మాధర్మాలూ, వాటిని ప్రతిపాదించే ఋగ్వేదాది శాస్త్రాలూ ఇవన్నీ అబద్దమెలా అవుతాయి. అది సత్యం కావలసిందే అని ఆక్షేపణ వస్తుంది.
అదికూడా చెల్లదని కొట్టి వేస్తున్నారాచార్యులవారు. 'నమాతా పితావా' తల్లిలేదు తండ్రిలేడు. తల్లిదండ్రులిద్దరూ లేరని నిషేధించటంతో జీవుడికసలు జన్మేలేదని చెప్పినట్టయింది. జన్మేలేని వాడిక ఉత్రమణ చెందేదేముంది? ఆయా లోకాలకు వెళ్ళేదేముంది? కనుకనే “నదేవా నలోకాః” దేవతలూ లేరు, దేవలోకాలూ లేవు. చచ్చిన తరువాత కేవల కర్మిష్ఠులైతే ధూమాది మార్గంలో పితృలోకానికి వెళ్ళుతారనీ, ఉపాసనాశీలురైతే అర్చిరాది మార్గంలో స్వర్గాది దేవలోకాలకు వెళ్లుతారనీ ఒక ప్రతీతి ఉంది.
Page 26