అతీతం గనుకనే దానిని నమ్మలేకపోతున్నాము. క్రమంగా అనుమాన స్థాయికీ, అక్కడి నుంచి ప్రత్యక్ష స్థాయికీ దిగివచ్చిందంటే నమ్ముతాము. ఆ రెండు స్థాయులకూ దాన్ని దించటానికే ఈ హేతు దృష్టాంతాలనేవి తోడుపడతాయి. అంతవరకూ దూర దూరంగా ఉండిపోయిన శాస్త్ర రహస్యం తద్వారా మనకు దగ్గరగా వచ్చి చివరకు మన అనుభవంగానే పరిణమిస్తుంది. ఈ శాస్త్ర ప్రక్రియను కూలంకషంగా జీర్ణించుకొన్న భగవత్పాదులు క్రమంగా పూర్వార్ధంలో ప్రతిజ్ఞా రూపమైన ఆగమ ప్రమాణాన్నీ ఉత్తరార్ధం మొదటి పాదంలో అనుమాన ప్రత్యక్షాలకు చిహ్నమైన హేతు దృష్టాంతాలనూ ప్రతిపాదించి చివర నాలుగవ పాదమయిన మకుటంలో శాస్త్రార్ధాన్నంతా మరలా నిగమనం చేసి చూపారు. నిగమనమంటే చెప్పిన విషయాన్నే హేతు దృష్టాంతాలతో సమన్వయించి మరలా ముక్తసరిగా చెప్పటం.
ఇది ఎంతో తార్కికమయిన దృక్పథమున్న శాస్త్రకారుడుగాని చేయలేడు. భగవత్పాదులెంతటి తత్త్వజ్ఞులో అంతటి తార్కికులు. తర్కంలో కూడా ఆయనది శుష్కతర్కం కాదు. శ్రుత్యనుగృహీతమయిన తర్కాన్నే ఆదరిస్తారాయన. దాన్నికూడా ఆయన ఒక ఉపకరణంగా వాడుకొన్నారేగాని అదే గమ్యమని ఎప్పుడూ భావించలేదు. ఆయన గమ్యం ఒక్కటే. అది సర్వాత్మభావం. అంటే అనాత్మగంధం కూడా లేని అఖండాత్మ తత్త్వం. దాన్ని జీవితంలో అనుభవించి లోకుల అనుభవానికి కూడా తేవాలనే ఆయన తాపత్రయం. అయితే అది శాస్త్ర సిద్ధాంతంగానే ఏకరువు పెడితే లోకులంత సులభంగా నమ్మరని ఆయనకు తెలుసు. కనుకనే హేతుదృష్టాంత రూపమయిన విచారణను కూడా దానికి తోడు చేసుకొని బోధిస్తూ వచ్చారు. ఈ విచారణకే తర్కమని పేరు. ప్రతిజ్ఞా హేతూ దాహరణాదులన్నీ దానికంగాలే. ఇలాంటి సాంగోపాంగమయిన తర్కాన్ని సాధనంగా తీసుకొని తాను నమ్మిన అద్వైత సత్యాన్ని జిజ్ఞాసు లోకానికి సప్రమాణంగా పంచి పెట్టటమే భగవత్పాదుల రచనలోని అద్భుతమయిన విధానం. అదే మనకీస్తోత్రంలో అడుగడుగునా సాక్షాత్కారిస్తుంది.
Page 15