అయితే భావన ఏ మాత్రమేర్పడినా అది ఆ భావనకు విషయమై ఆత్మ కాకపోతుందని మరలా భయం. ఎగదీస్తే బ్రహ్మహత్య దిగదీస్తే గోహత్య. ఎలాగో ఒకలాగా ఈ రెండింటికీ రాజీ కుదిర్చి తీరాలి. ఈ ధర్మసూక్ష్మాన్ని కూడా ఆలోచించారు భగవత్పాదులు. అందుకే ఆయన వృత్తి అని ఒకదాన్ని తాత్కాలికంగా ప్రవేశపెట్టారు. దీనిని వృత్తి అని, జ్ఞానమని, విద్య అని, వివేకమని అనేక నామాలతో వ్యవహరిస్తారాయన. ఇది ఆత్మాకారమైన ఒక భావన. ఆత్మకాకారమే లేదు గదా, భావన ఎలా ఏర్పడుతుందని అడిగితే ఒక విశిష్టమైన ఆకారం లేకపోయినా సామాన్యమైన ఆకృతి ఒకటి ఉందన్నారాయన. ఆకృతిగాని ఆకృతి అది. అదే సత్తు, చిత్తు, ఆనందం. సత్తంటే ఉండటం. చిత్తంటే జ్ఞానం. ఆనందమంటే మరొకదాని సంపర్కం లేకుండా తనపాటికి తానుండటం. మూడింటినీ కలిపి చెబితే ఆకాశం మాదిరి నిత్యమూ అఖండముగా వ్యాపించి ఉన్న జ్ఞానమేనని అర్ధం. ఆకాశంలాగానే దానిని భావన చేయవచ్చు. ఆకాశానికి రూపం లేకపోయినా ఒక పెద్ద ఖాళీ అని ఎలా మనసుకు తెచ్చుకోగలమో అలాగే ఈ సచ్చిదాత్మకమైన తత్వాన్ని కూడా తెచ్చుకోవచ్చు. అయితే అది జడాకాశ మిది చిదాకాశం. అంతే తేడా. ఇలాంటి చిదాకాశమే నా స్వరూపమనే భావనకే వృత్తి అని పేరు. అఖండాకారమైన ఈ వృత్తిలో మిగతా అనాత్మ జగత్తుకు చెందిన ఖండ వృత్తులన్నీ లయమైపోతాయి. అలా జగత్తునంతా లయం చేసుకొన్న తరువాత నిరింధనమైన అగ్నిలాగా ఈ వృత్తికూడా నిరాశ్రయమైన మన ఆత్మ చైతన్యంలోకి లయమవుతుంది. అప్పుడాత్మ అనేదొక్కటే అవశిష్టమై, ఏకమై, కేవలమై, శివమై ప్రకాశిస్తుంది.
ఇక్కడికి స్తోత్రంతో ప్రతిపాదించిన విషయాన్ని మనం విపులంగా చర్చించాము. పోతే ఇకదాన్ని ఆచార్యులవారు ప్రతిపాదించిన విధానమేమిటో చూడాలి. అదికూడా ఇంతకుముందే కొంత సూచన చేశాము. అనాత్మ ప్రపంచనిరాకరణమే ఆ విధానం. ఈ నిరాకరణమే ప్రతిశ్లోకంలోనూ మొదటి రెండు పాదాలలో నడుపుతూ వచ్చారు భగవత్పాదులు. “నభూమిర్నతోయం నవర్ణాన వర్ణాశ్రమాచార ధర్మాః నమాతా పితావా" అని ఈ విధంగా చివరదాక నడుస్తూ పోతుంది. సరిగా ఇది బృహదారణ్యకంలోని 'నేతి నేతి' వాక్యానికి సహోదరంగా కనిపిస్తుంది. ఆగమ రూపమైన శాస్త్రం ప్రతిపాదించే మార్గమిలాగే ఉంటుంది.
Page 13