అలాగే పృథివ్యాదులైన పంచ భూతాలూ అన్నమయాది పంచకోశాల రూపంలో పంచీ కృతమయ్యే సరికి మదశక్తిలాగా ఒకానొక చైతన్యశక్తి అందులో ఆవిర్భవించింది. అది కూడా తాత్కాలికమే. దేహేంద్రియాదుల కలయిక వల్ల ఏర్పడిందే గనుక అవి విడిపోగానే వాటితోపాటు తానూ తొలగిపోతుంది. అలా తొలగి పోతున్నట్టు మరణ కాలంలో ప్రత్యక్షంగా చూస్తునే ఉన్నాము మనం. కాబట్టి చైతన్య మనేదొకటి దేహేంద్రియాది వర్గానికి భిన్నంగా స్వతంత్రంగా ఎక్కడా లేదని వీరి సిద్ధాంతం.
కాగా వీరి కన్నా ప్రబుద్ధులు కొందరున్నారు. వారే బౌద్ధులు వారిలో కూడా నాలుగు తెగలవారైతే ఆ నలుగురిలో వైజ్ఞానికులనీ, మాధ్యమికులనీ ఇద్దరు గడుసువారు. అందులో వైజ్ఞానికులనే వారు చలాం బుద్ధిం. అనుక్షణమూ మారిపోతున్న బుద్ధి వృత్తులనే Functions of the Mind పట్టుకొని ఆత్మ మరేదీ కాదని వాదిస్తారు. పుడుతూ గిడుతూ పోయే వృత్తి జ్ఞాన మాత్మ ఎలా అవుతుందని కొంచెమైనా ఆలోచించరు. అలాగే మరొకరున్నారు. మాధ్యమికులు వీరికే శూన్యవాదులని ఇంకొక నామ ధేయం. వీరు మరీ అఖండులు. అసలు బుద్ధేమిటి, వృత్తేమిటి ఆత్మ అనేది ఏదీ కాదు. అది ఎక్కడా లేదు. మన లోపలా లేదు వెలపలా లేదు ఆకాశం లాగా అది వట్టి శూన్యం పొమ్మంటారు.
చూడబోతే శాస్త్రజ్ఞులని పేరేగాని వీరందరూ లౌకికుల కన్నా అన్యాయంగా కనిపిస్తున్నారు. ఏ శాస్త్రజ్ఞానమూ లేని లోకులూ అలాగే భావిస్తున్నారు.
Page 48