పోతే మన చైతన్యాని కుపాధి లేకుండా అది నిరుపాధికంగా విస్తరించింది. దానితో జీవభావం కూడ ఎగిరిపోయింది. మరి ఈ విస్తరించిన చైతన్యమే ఈశ్వరుడు కాబట్టి ఈశ్వర భావం కూడ అందులోనే కలిసి వచ్చింది. అప్పుడిక మూడూ మూడుగా గాక ఏకంగా మారి అది నా ఆత్మస్వరూపంగానే అనుభవానికి రాగలదు. దీనికే ఏకాత్మ భావం లేదా సర్వాత్మ భావమని పేరు. ఇది ఎప్పుడూ ఉన్న నిత్యముక్తుడా పరమేశ్వరుడు. ఆయనకే దక్షిణామూర్తి అని నామాంతరం. దక్షిణ, వామ అంటే జ్ఞాన, క్రియాశక్తులు. పరమాత్మకు జ్ఞానం స్వరూపమైతే క్రియ అనేది విభూతి. విభూతి స్వరూపంలోనే ఉంది.
గనుక దక్షిణామూర్తి అంటే రెండూ కలిసిన పరిపూర్ణ తత్త్వం. ఆ తత్త్వాన్ని అందుకొన్న ఆచార్యపురుషుడు కూడ తత్తుల్యుడే. గురు స్సాక్షాత్పరం బ్రహ్మ అని అందుకే అన్నారు. ఆ గురుబోధ నందుకొని తరించగోరే శిష్యులు కూడ వాస్తవంలో బ్రహ్మ స్వరూపుడే. “ఓదనం పచతి” అన్నట్టు భవిష్యద్వృతిని బట్టి అతడూ వారితో సమానుడే నని భావం. కనుకనే ముగ్గురికి కలిపి నమఇదం, నమస్కారమంటున్నారు ఆచార్యుల వారు. ముగ్గురని పేరే గాని ఆత్మ రూపేణ ప్రస్తుతం ముగ్గురూ ఒక్కరే గదా. “ఈశ్వరో గురురాత్మేతి” అని సురేశ్వరులు కూడ అందుకే గదా ఏకైకమైన తత్త్వంగా వర్ణించారు. కాబట్టి ఇంతకూ తేలిందేమంటే ఈ కనిపించే ప్రపంచాన్ని మానవుడు అధ్వయంగా భావించగలిగితే చాలు. ఇక ప్రపంచమూ లేదు. జీవుడూ లేడు. ఈశ్వరుడూ లేడు. అంతా కలిసి ఆత్మ స్వరూపమే.
Page 20