మరి ఈ వీణా రూపమైన నాదమే కళా రూపంగా ఘనీభవిస్తే అది వైఖరీ రూపమైన ఈ చరాచర జగత్తుగా దర్శనమిస్తుంది. ఇది ఆ శక్తికి నాల్గవ దశ. దీనికి ద్యోతకమే పుస్తకమనే మాట. ఈ విధంగా ఈ నాలుగు మాటలూ పరాపశ్యంత్యాదులైన నాలుగు శక్తి రూపాలకూ ప్రతీకలు. ఇవి చేతులలో ధరించటమంటే ఆ చైతన్యం వీటిని తన కధీనం చేసుకొని ఉందన్న మాట. అహం బ్రహ్మాస్మి అనుకొంటే మనకూ అవి స్వాధీనం కాగలవని సూచన.
'యోగ పట్టాభి రామః' అయితే ఆ స్వాధీనమయ్యే ఉపాయమేదో ఆలోచించాలి మనం. అదే యోగం కలయిక పరిపూర్ణమైన చైతన్యం. పరిపూర్ణమైన బ్రహ్మ చైతన్యంతో ఏకమనే భావన. అది నిత్య సిద్ధుడైన ఈశ్వరుడికి పట్టం లాంఛనమై కూచుంది యోగ పట్టాభి రాముడాయన. క్రొత్తగా సాధించనక్కర లేదాయన. ఎటువచ్చి ఆ పట్టా పుచ్చుకోనిది మనమే. నిరంతర బ్రహ్మాను సంధానం సాగిస్తూ పోతే ఏ జన్మకో ఒక జన్మకది మనకూ ప్రాప్తిస్తుంది. ప్రాప్తిస్తే అప్పటి నుంచీ మనమూ పట్టాభి రాములమే అలా సాధించి మీరు కూడా కండనే ప్రబోధం.
పట్టాభిరాముడై ఊరక కూచో లేదాయన మునివరనికరై సేవ్యమానః చుట్టూచేరి ఉన్నారు వసిష్ఠాది మహర్షులు. ఆయన వ్యాఖ్యాన పీఠంలో కూచొని వారికి తత్త్వాన్ని వ్యాఖ్యానించి చెబుతున్నాడు. ఆచరతి ఆచారయతి. తానాచరించి తన వారిని కూడా ఆచరింప చేసేవాడు గదా ఆచార్యుడు ఆచరించవలసిందేదో అది ఆచరించాడా ఈశ్వరుడు.
Page 105